ప్రజా పాలన దరఖాస్తులకు రెడీగా ఉండాలి – జనగామ కలెక్టర్ శివలింగయ్య

జనగామ, చౌరాస్తా :రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కోసం అధికారులు సిద్ధంగా ఉండాలని జనగామ కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6 వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు, రెవెన్యూ) పర్మార్ పింకేశ్ కుమార్, సుహాసిని, జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎంపీడీవోలు, ఎమ్మార్వోలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని, నియోజకవర్గం, మండల, గ్రామస్థాయిల్లో ప్రత్యేక అధికారుల బృందాలను నియమించనున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి , గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రైతు భరోసా తదితర పథకాలు (ఆరు గ్యారెంటీ)ల కోసం ఉదయం, 8 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి 6 గంటల వరకు, రెండు ధాపాలుగా దరఖాస్తులు స్వీకరించాలన్నారు.

ప్రజలకు చేరువగా పాలన అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందన్నారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి కావలసిన కుర్చీలు, టెంట్లు, తాగునీరు, మహిళలు, పురుషులకు వేరువేరుగా క్యూలైన్లల్లు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు ఒకరోజు ముందు ప్రతి గ్రామాలలో, వార్డుల్లో దండోరా (టామ్ టామ్) వేయించి, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు ముందు ప్రభుత్వ సందేశం వినిపించి కార్యక్రమాలను ప్రారంభించాలన్నారు. గ్రామస్థాయిలో గ్రామపంచాయతీ పట్టణ స్థాయిలో వార్డు ఆఫీసులలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమాలు నిర్వహించబోయే తేదీలు సమయాలను ముందస్తుగా ప్రజలకు తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో అనిల్ కుమార్, సీపీఓ ఇస్మాయిల్, డిఆర్డీఓ మొగులప్ప, డీపీఓ రంగాచారి, జనగామ, స్టేషన్ ఘన్ పూర్ ఆర్డీవోలు మురళీకృష్ణ, రామ్మూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రశాంత్, డిఎస్ఓ రోజా రాణి, బిడబ్ల్యుఓ జయంతి, అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

You may also like...